హత్య నిందితుల జాబితాలో జగన్ పేరునూ చేర్చాలి : యనమల

వివేకానందరెడ్డి హత్య వెనుక నేరపూరితమైన కుట్ర ఉందని స్పష్టమైందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఐపీసీ సెక్షన్ 120బి ప్రకారం జగన్ కూడా హత్యలో ముఖ్య భాగస్వామి అనేది సాక్షుల వాంగ్మూలాలను బట్టి స్పష్టంగా అర్ధమౌతోందన్నారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ రెడ్డి అంతా క్రిమినల్ కాన్స్పిరెన్సిగా ఏర్పడి వివేకాను హత్య చేశారని సీబీఐ దర్యాప్తును బట్టి అర్ధమౌతోందన్నారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారో వివేకా కూతురు, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులంతా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారన్నారు.

సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్టు) ప్రకారం వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డి పాత్ర ఉందనటానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సీబీఐ అవినాశ్ రెడ్డితో పాటు జగన్ రెడ్డి పేరు కూడా ఎఫ్ఐర్, చార్జ్ షీట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం రాజధానిపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉందిగానీ శాసనసభకు లేదని తీర్పులో ఉందని పేర్కొన్నారు. శాసనసభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం లేదన్నారు.

అధికార బలం, అహంకార మదం ఉంది తప్ప ఆలోచనా బలం వైసీపీకి లేదని విమర్శించారు. అభివృద్ది వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదని, బడ్జెట్ ను అన్ని ప్రాంతాలకు సమానంగా పంచి రాష్ట్రం అంతా అభివృద్ది చేయాలన్నారు. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించి, మాట్లాడితే అభివృద్ది వికేంద్రకరణ అని కబుర్లు చెబుతున్నారని, కానీ వైసీపీ 3 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ది చేశారో, ఏఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు నెలకొల్పారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *