దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం : సీఎం జగన్

దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, దాదాపుగా 500 కొత్త ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను రాష్ట్రం నలుమూలలకూ పంపుతున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బెంజ్ సర్కిల్ లో శుక్రవారం తల్లీబిడ్డ ఎక్సప్రెస్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’’ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని మొట్టమొదట నుంచి ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, ఆ చెల్లెమ్మలు గర్భం దాల్చిన వెంటనే వారికి అండగా ఉంటూ.. రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం.

అందులో భాగంగానే గర్భవతి అయన చెల్లెమ్మ 108 కి ఫోన్‌ చేసిన వెంటనే వాహనం అక్కడికి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లడమే కాకుండా నాణ్యమైన సేవలు ఆస్పత్రిలో అందించి, డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు కూడా వారి చేతిలో పెడుతున్నాం. ఇంటికి వెళ్లేటప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి, వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, సిజేరియన్‌ అయితే రూ.3వేలు, సహజ ప్రసవం అయితే రూ.5వేలు ఆరోగ్యఆసరా కింద విశ్రాంతి సమయంలో కూడా తోడుగా ఉండేందుకు ఈ మొత్తాన్ని చెల్లెమ్మ చేతిలో పెట్టి.. ఆమెను ఈ తల్లీబిడ్డ ఎయిర్‌ కండిషన్డు వాహనంలోనే ఇంటివరకు పంపించి, వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో మనమంతా చూశాం. అరకొరగా ఉండే వాహనాలు, అదీ ఒక్కొక్కసారి అందుబాటులో లేని పరిస్థితి ఉండేది. ఉన్నవాటిలో కూడా వసతులు సరిగా లేని పరిస్థితుల నుంచి పూర్తిగా మెరుగైన పరిస్థితుల్లోకి తీసుకువస్తున్నాం. 104, 108 వాహనాలతో పాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను నాడు–నేడు పనులతో మెరుగుపర్చడంతో పాటు  మొత్తం ఆస్పత్రి వ్యవస్ధల రూపురేఖలు మార్చుతున్నాం. వీటన్నింటితో అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను‘‘ అని అభిప్రాయపడ్డారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *