వైసీపీలో జీరో పెర్ఫార్మెన్స్ ఎమ్మెల్యేలు వీరే..!

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇటీవ‌లే మొద‌లుపెట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్రభుత్వం కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం నిర్వహించిన వర్క్ షాపు ద్వారా స‌మీక్షించిన సంగ‌తి తెలిసిందే. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జరుగిన ఈ స‌మీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లు, జిల్లాల అధ్యక్షులు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలు హాజ‌ర‌య్యారు.  ఈ స‌మావేశానికి ముందే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల ప‌నితీరుపై జ‌గ‌న్ నివేదిక తెప్పించుకున్నారని తెలుస్తోంది.

తాజాగా బుధ‌వారం నాటి స‌మీక్షలో జ‌గ‌న్ ఆ నివేదిక‌ను బ‌య‌ట‌పెట్టేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటిదాకా కాలు మోప‌ని నేత‌లు ఏడుగురు ఉన్నారంటూ జ‌గ‌న్ చెప్పారు.  వీరంతా ఇప్పటిదాకా ఈ కార్యక్రమానికే హాజ‌రు కాలేదని చెప్పిన జ‌గ‌న్‌…ఈ ఏడుగురు ఎమ్మెల్యేల‌ను జీరో పెర్ఫార్మెన్స్ క‌లిగిన నేత‌లుగా తేల్చారు. ఈ జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే న‌ల్లపురెడ్డి ప్రస‌న్నకుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ ఉన్నారు.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), ఎన్టీఆర్ జిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణప్రసాద్, నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్రపాణి రెడ్డి ఉన్నట్లుగా తేలింది.  ఇంకో ఎమ్మెల్యే పేరు బ‌య‌ట‌కు రాలేదు. ఈ జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఉండ‌టం గ‌మ‌నార్హం. అంతేకాకుండా వైసీపీ ఫోకస్ పెట్టి మరి గత ఎన్నికల్లో నెగ్గిన మైలవరంలోనూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జోష్ తగ్గించారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులుగా ప‌నిచేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ప్రతి నెలా తన ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ సమీక్షించనున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *