నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ కోసం సుమారు 12 గంటల పాటు బాలింతలు నిరీక్షించారు. పచ్చి బాలింతను భూదేవిగా పోలుస్తూ ప్రభుత్వ వైద్యశాల లోని ప్రసూతి కేంద్రం నుండి పురిటి బిడ్డ తో కలిపి తల్లిని, వారి సంరక్షకులను వైద్యశాల నుండి జాగ్రత్తగా ఇంటి వరకు చేర్చే తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ తో ఆత్మకూరులో బాలింతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Talli Bidda Express Vehicles Problem at Atmakur

ఇది జిల్లా వైద్యశాల కావడంతో ప్రసూతి విభాగం లోని ఇక్కడి డాక్టర్లు బాగా సేవ చేస్తూ మంచి పేరు ఉండడంతో ఉదయగిరి, వరికుంటపాడు, బద్వేలు ప్రాంతాల నుండి కూడా చాలామంది ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు వస్తూ ఉన్నారు. బాలింతలను వారి ఇంటి వద్దకు జాగ్రత్తగా చేర్చే క్రమంలో ఏర్పాటుచేసిన తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు రెండు ఉండగా ప్రస్తుతం ఓ వాహనం లోనే తల్లి బిడ్డల తరలింపు కార్యక్రమం జరుగుతుంది.

ఒకరిని వారి గ్రామంలో వదిలి వచ్చిన తర్వాతనే మరొకరిని వదలవలసిన క్రమంలో నిన్న 6 మంది బాలింతలు ఇళ్లకు వెళ్లాల్సి ఉండగా సుదూర ప్రాంతమైన ఉదయగిరి ప్రాంతానికి చెందిన ముగ్గులు బాలింతలు సాయంత్రం వరకు నిరీక్షించిన తర్వాత సాయంత్రం బండి వచ్చి మా బండి కి లైట్లు లేవు, రాలేదని చెప్పడంతో ఉసూరుమంటూ బాడుగకు ఆటో మాట్లాడుకొని చీకటి వేళ వారి గ్రామాలకు ప్రయాణమయ్యారు బాలింతలు.

Talli Bidda Express Vehicles

సమస్య ముందే చెప్పి ఉంటే సాయంత్రం వరకు ఈ చెట్ల కింద కూర్చో వలసిన అవసరం లేదు కదా అంటూ బాధపడుతూ అక్కడ నుండి వారు వెళ్ళారు. ప్రతి రెండు రోజులకు ఇటువంటి పరిస్థితే హాస్పిటల్ వద్ద ఉందని జిల్లా వైద్యశాల గా ఉన్న ఇక్కడి ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి విభాగంలో ఉన్న అవసరాన్ని బట్టి తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ మూడు వాహనాల అవసరం ఉందని హాస్పిటల్ సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు.