గన్నవరంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.  శనివారం వంశీ చేసిన వ్యాఖ్యలపై దుట్టా రామచంద్రారావు భగ్గుమన్నారు. తాను ఫ్యాక్షన్ రాజకీయాలు చేయనని, ఎమ్మెల్యే అభ్యర్థిని అధిష్టానం ఖరారు చేయాలన్నారు. గతంలో నేనెప్పుడూ టికెట్ కావాలని అడగలేదని, పిలిచి టికెట్ ఇచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇస్తే తాను సహకరించనని తేల్చి చెప్పారు. మట్టి తవ్వకాలు, మల్లవల్లి భూములపై దర్యాప్తు చేయాలని, బాధ్యులెవరైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వంశీ మాదిరి ఊసరవెల్లి రాజకీయాలు చేయమమని దుట్టా అల్లులడు శివభరత్ రెడ్డి విమర్శించారు. వైసీపీ మాది.. మేము పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ఈ రెండేళ్లలో ఎక్కడికి పోతాడో వంశీకే తెలీదని, తమ జోలికొస్తే ఊరికునేదే లేదని హెచ్చరించారు. దమ్ముంటే రా.. ఎవరు ఎన్ని కేసులు పెట్టారో తేల్చుకుందాం అని సవాల్ విసిరారు.  వంశీ విలన్ అనే మాటకు కట్టుబడి ఉన్నామని, వంశీ హీరో అనుకుంటే సినిమాలు తీసుకోవాలని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వ్యక్తిగత దూషణలు సరికాదని, సంస్కారం లేనివాడు తిడతాడన్నారు.

అరిచే కుక్క కరవదని,  2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే.. ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడమేంటని ప్రశ్నించారు.  ఇక యార్లగడ్డ, దుట్టాకు వల్లభనేని వంశీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనకు ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వనక్కర్లేదని, పిచ్చి చేష్టలు మానకపోతే నేనేంటో చూపిస్తానని హెచ్చరించారు. తాను మాట్లాడితే ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రారని, మీ గురించి చెప్తే పెద్ద పెద్ద గ్రంథాలే అవుతాయన్నారు. దీంతో  పొలిటికల్ టెన్షన్ నెలకొంది. నేదల మధ్య వార్నింగ్ లు నెలకొనడంతో వంశీకి భద్రత పెంచారు. 25 మంది పోలీసులతో ప్రత్యేక పహారా విధించారు.