ప్రముఖ సినీ నటి నయనతార , తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ల వివాహం నిన్న మహాబలిపురంలోని ఓ రిసార్టులో వైభవంగా జరిగింది. నెట్టింట ఎక్కడ చూసినా వీరి పెళ్లిఫొటోలే దర్శనమిస్తున్నాయి. కానీ.. ఈ కొత్తపెళ్లి కూతురు అప్పుడే ఓ వివాదంలో చిక్కుకుంది. పెళ్లయ్యాక నవ దంపతులు శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చారు. ఈ క్రమంలో నయనతార కొత్త వివాదంలో చిక్కుకుంది.

Nayanthara and Vignesh Shivan seek blessings at Tirupati temple

నయనతార దంపతులు స్వామి వారి కళ్యాణోత్సవ సేవలో పాల్గోన్నేందుకు నేరుగా ఓ బృందంతో మధ్యాహ్నం 12 గంటలకు కల్లా తిరుమలకు చేరుకున్నారు. నయనతార దంపతులు తిరుమలలోని ఎస్ఎంసీ కాటేజ్ వెనుక వైపు నుంచి సుపథం మార్గం చేరుకున్నారు. అయితే నయనతార దంపతులతో పాటుగా మొత్తం 26 మందిని టీటీడీ ఉద్యోగి సుపథం మార్గం ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా సామాన్య భక్తులతో పాటుగా శ్రీవారి ఆలయం తీసుకొచ్చారు. కల్యాణోత్సవ సేవలో కొంతసేపు గడిపిన నయనతార విఘ్నేష్ దంపతులు స్వామి వారి దర్శనంతరం ఆలయం బయటకు చేరుకున్నారు. కాగా అక్కడున్న భక్తులు ఈ జంటను చూసేందుకు ఉత్సాహం చూపారు. మరికొందరు ఫొటోలు తీసుకున్నారు.

ఆలయం నుంచి వచ్చిన నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు శ్రీవారి పుష్కరిణికి అభిముఖంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. శ్రీవారి ఆలయం ముందు నయనతార దంపతులు ఫోటో షూట్ చేశారు. ఇది అంతా ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయం ముందుగా నిర్వహించడంపై పలువురు భక్తులు మండిపడుతున్నారు. కలియుగ వైకుంఠనాధుడి విహరించే తిరుమాఢ వీధుల్లో సైతం నయనతార పాదరక్షణలు ధరించి నడిచారు. విఘ్నేశ్ చెప్పుల్లేకుండానే నడవగా.. నయన్ తో పాటు మరికొందరు చెప్పులు, బూట్లతో కనిపించారు. దీనిపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నయనతార ఎలా పాదరక్షలు ధరించి నడుస్తుందని ప్రశ్నిస్తున్నారు. వెంటనే నయన్.. పవిత్రమైన స్థలంలో చెప్పులతో నడిచినందుకు స్వామివారిని క్షమించమని కోరాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మరికొందరు పెళ్లయిన మొదటిరోజే కొత్త పెళ్లికూతురు వివాదంలో చిక్కుకుందే అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ఘటనపై నయన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.