బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంతే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. బాలీవుడ్లో అయితే ఏ సినిమాకు సాధ్యం కాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో రూ.350 కోట్లకు పైగా రాబట్టి.. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును అందుకుంది.
తాజాగా ఈ చిత్రం రూ.1000కోట్ల క్లబ్లో చేరింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన నాలుగో సినిమాగా ‘కెజియఫ్ 2’ రికార్డులకు ఎక్కింది. దీని కంటే ముందు ఉన్న సినిమాల్లో ఈ ఘనత సాధించిన సినిమాల్లో ఆమిర్ ఖాన్ ‘దంగల్’, ప్రభాస్ ‘బాహుబలి 2’, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఉన్నాయి. అందులో రెండు సినిమాలు రాజమౌళివే కావడం విశేషం. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ సినిమాలు లేకపోవడం ‘కేజీయఫ్2’కు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది.
‘కేజీయఫ్’ దక్కించుకున్న తర్వాత రాఖీ ఏం చేశాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. అతనిని ఎదుర్కొనేందుకు ఒకవైపు అధీర, మరోవైపు రమీకా సేన్లు ఎలాంటి ప్రయత్నాలు చేశారన్న అంశాలతో ప్రశాంత్ ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా హీరో యశ్ నటన, ప్రశాంత్ టేకింగ్ సినిమాను అగ్రస్థానంలో నిలిపాయి. ప్రతి సీన్ మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా తీర్చిదిద్దారు. సినిమా చివరిలో ‘కేజీయఫ్-3’కూడా హింట్ ఇవ్వడం గమనార్హం.

