Site icon 123Nellore

టార్గెట్ పెద్దిరెడ్డి..!

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోషిస్తున్న పాత్ర ఎవరికీ తెలియనిది కాదు. ఆయన అంగ, అర్థబలాలు కూడా ఎరుగని వారంటూ ఎవరూ లేరు. దీంతో ఆయన నియోజకవర్గంలో ఎదురులేని నాయకుడిగా పెద్దిరెడ్డి ముద్ర వేసుకున్నారు. అంతేకాదు ఏకంగా చంద్రబాబుతో ఢీ కొట్టాలన్న ఆలోచనలో కూడా ఒకానొక సందర్భంలో పెద్దిరెడ్డి ఉన్నారు. ఇందుకోసమే మొన్నటి కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన తొలసారి ఎన్నికల్లో వైసీపీ జెండాను రెపరెపలాడించారు. దీంతో పెద్దిరెడ్డి ఎదురులేని శక్తిగా జిల్లాలో ఎదిగారు. ఇప్పుడు ఇదే చంద్రబాబుకు కూడా మింగుడు పడటం లేదు.

విద్యార్థి దశ నుండి ఇద్దరూ ప్రత్యర్థులుగా వస్తున్నారు. నేరుగా కాకపోయినా ఇద్దరు నేతలు ఒకే జిల్లాలో తమ ప్రభావాన్ని చూపిస్తుంటారు. అయితే చంద్రబాబు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి. తన అనుభవాన్ని, అర్థబలాన్ని ఉపయోగించి పెద్దిరెడ్డిని మాజీ చేసేందుకు చంద్రబాబు కూడా గట్టిప్రయత్నాలే చేస్తున్నారు. రాజకీయంగా పెద్దిరెడ్డిని ఓడించాలంటే ఆశామాషీ వ్యక్తిని పోటీలో నిలబెడితే అది అయ్యేపనే కాదు. దీని కోసమే గట్టి అభ్యర్థి కోసం చంద్రబాబు జల్లెడ పట్టారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి, పుంగనూరు ఇంఛార్జ్ గా కొనసాగుతున్న అనీషారెడ్డిని తప్పించి చల్లా రామచంద్రారెడ్డిని దింపారు. అక్కడ పార్టీలో చేరికలను కూడా ప్రారంభించారు. ఇటీవల పార్టీలో ముస్లిం వర్గానికి చెందిన పలువురు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే పుంగనూరుపై చంద్రబాబు గట్టిగానే ఫోకస్ పెట్టారనిపిస్తోంది. అక్రమ సంపాదన, దౌర్జన్యాలతో చెలరేగుతున్న మంత్రి పెద్దిరెడ్డి లెక్కలు అన్నీ తేల్చుతామని, పుంగనూరులో ఇప్పటికే పుంజును వదిలామని టీడీపీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (బాబు)ను ఉద్దేశించి వ్యాఖానించారు. పెద్దిరెడ్డిని ఓడగొట్టేందుకు పుంగనూరుపై ఎన్నికలకు రెండేళ్లు ముందుగానే దృష్టిపెట్టారని తెలుస్తోంది. ఇతర రెడ్డి సామాజిక వర్గ నేతలపైనా చంద్రబాబు దృష్టిపెట్టారు. చంద్రబాబు ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది చూడాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Exit mobile version