Site icon 123Nellore

ఎమోషనల్‌ అయిన మెగా హీరో.. వీడియో వైరల్..!

గతేడాది బైక్‌ ప్రమాదంలో గురైన మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆర్నెళ్ల పాటు సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. ఈ మధ్యలో మెగా ఫ్యామిలీ వేడుకల్లోనూ, ఇతర ఫంక్షన్స్‌లో ఆయన కనిపించినా… షూటింగ్ మాత్రం చేయలేదు. యాక్సిడెంట్ అయిన ఆరు నెలల తర్వాత… ఇవాళ తొలిసారి సెట్స్‌కు వచ్చారు.

కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఇటీవల ఆయన ‘SDT 15’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మార్చి 28న ప్రారంభమైంది. తొలిరోజు షూటింగ్‌కు సాయిధరమ్‌ తేజ్‌ హాజరయ్యారు. కొన్నాళ్ల విరామం తర్వాత తొలిసారి చిత్రీకరణలో పాల్గొనడంతో చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం పలికింది. కొందరు ‘వెల్‌కమ్‌ బ్యాక్‌ సాయి తేజ్‌’ అనే బోర్డులతో స్వాగతించగా మరికొందరు పుష్పవర్షం కురిపించారు. యూనిట్ సభ్యుల ఆత్మీయ స్వాగతం చూసి సాయి తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఆనంద భాష్పలతో అందరికీ నమస్కరించారు. అనంతరం, వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే సెట్స్‌లో నటులు వరుణ్‌తేజ్‌, ఆర్‌. నారాయణమూర్తి అతిథులుగా మెరిశారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్‌ షేర్‌ చేశారు. ఇక సాయితేజ్‌ తిరిగి షూటింగ్‌లో పాల్గొనడం పట్ల వరుణ్‌ తేజ్‌ స్పందిస్తూ.. ‘నిన్ను సెట్స్‌పై మళ్లీ చూడటం చాలా సంతోషంగా ఉంది బావా. లవ్‌ యూ’ అంటూ ట్వీట్‌ చేశాడు.  సంబంధిత వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, దర్శకుడు సుకుమార్‌ నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్‌, కథానాయిక, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Exit mobile version