ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద సందడి కొనసాగిస్తోంది. మార్చి 25న పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్పై కనక వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే తొలిరోజు కలెక్షన్లతో బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన మైలురాయిని అందుకుంది. మూడు రోజుల్లో రూ.500కోట్లు వసూళ్లు చేసి సరికొత్త రికార్డును సృష్టించిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు, ట్రేడ్ నిపుణుడు తరుణ్ఆదర్శ్ ట్వీట్ చేశారు.
మరోపక్క హిందీలో ‘ఆర్ఆర్ఆర్’కు మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. ఉత్తరాదిన హిందీ, తెలుగు, తమిళ్ వెర్షన్స్ విడుదల అయ్యాయి. నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ మొదటి రోజు రూ. 20 కోట్లు వసూలు చేస్తే… రెండో రోజు (శనివారం) రూ. 23.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదివారం అయితే రూ. 31.50 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మీద మొదటి మూడు రోజుల్లో హిందీ వెర్షన్ వసూళ్లు రూ. 74.50 కోట్లు కలెక్ట్ చేసింది. కరోనా తర్వాత హిందీలో సినిమా విడుదలైన తర్వాత మొదటి ఆదివారం ఎక్కువ వసూలు చేసిన సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు వస్తే… నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’కు మూడు రోజుల్లో రూ. 53.45 కోట్లు, సీడెడ్ (రాయలసీమ)లో రూ. 26 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 8.67 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిగతా జిల్లాలు తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ వసూళ్లు కూడా బావున్నాయి. కనీసం మరో వారం రోజుల పాటు మరో పెద్ద సినిమా లేదు కాబట్టి, కలెక్షన్లు ఇదే స్పీడ్లో కొనసాగితే పోస్ట్-పాండమిక్ రికార్డ్ను క్రియేట్ చేసే సత్తా ఈ సినిమాకి ఉంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమురం భీమ్గా తారక్ నటించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. అలియాభట్ , ఒలీవియా మోరీస్ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్గణ్ కీలకపాత్రల్లో కనిపించారు.

