Site icon 123Nellore

హత్య కేసులో ఎంపీ అవినాష్‍రెడ్డి తప్పించుకోలేడు : మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా డీఎల్ వైసీపీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వివేకా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో పులివెందులలో అందరికీ తెలుసన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ హత్య చేసిన వ్యక్తులు తప్పించుకోలేరన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదని హితవు పలికారు. తనకు తెలిసినంత వరకు అవినాష్‍రెడ్డి తప్పించుకోలేడని, తనకు సీబీఐ మీద ప్రగాఢ నమ్మకం ఉందన్నారు.

పాత్రధారులు, సూత్రధారులు జైల్లో ఉన్నారని, అవినాష్ రెడ్డి హత్య చేశారని తేలితే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్నారని గుర్తు చేశారు. ఎర్ర గంగిరెడ్డి ఎప్పుడూ వివేకా దగ్గర ఉండేవారని, గంగిరెడ్డికి ఫోన్ చేస్తే గుండెపోటుతో చనిపోయాడన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నుండి దేవిరెడ్డి శంకర్రెడ్డికి ఎర్ర గంగిరెడ్డి టచ్‍లో ఉన్నాడని ఆరోపించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి సైతం శంకర్ రెడ్డికి టచ్‍లో ఉన్నాడని, ఇది తెలియక కృష్ణారెడ్డితో సునీత కంఫ్లైంట్ ఇప్పించారని పేర్కొన్నారు. శంకర్ రెడ్డి ఏం చెబితే అది కంప్లైంట్‍లో కృష్ణారెడ్డి రాసిచ్చారన్నారు.

సునీత, రాజశేఖర్‍ను పక్కన పెట్టుకుని చంద్రబాబు హత్య చేయించారని జగన్ సాక్షిలో నాడు నారాసుర రక్త చరిత్ర అని రాయించారని, సునీత, రాజశేఖర్ చంపారని ఇప్పుడు సాక్షిలో రాయడం సిగ్గుచేటన్నారు. కోడి కత్తి అడ్డుపెట్టుకుని రాజకీయాలు వేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు.  జగన్‍కు డబ్బుతో పనిలేదు, ప్రజలకు సేవ చేస్తారని ఆశించామని, కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జలపైనా సంచలన ఆరోపణలు చేశారు. ఓ సాధారణ విలేఖరి.. వందల కోట్లకు ఎలా అధిపతి అయ్యారని ప్రశ్నించారు. పది మంది బ్రోకర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

 

 

Exit mobile version