మద్యం మత్తులో ఉండి ఏకంగా పోలీస్నే చితకబాదాడో వ్యక్తి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ ప్లేస్లోనే పోలీసును కొడుతున్న వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. అసలు ఏం జరగిందంటే.. పోలీస్ కానిస్టేబుల్ జైప్రకాశ్ జైస్వాల్ లంచ్ చేయడానికి ఇంటికి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో దినేష్ ప్రజాపతి అనే వ్యక్తి మోటర్ బైక్తో కానిస్టేబుల్ జై ప్రకాశ్ బైక్ని ఢీ కొట్టాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
అలా పెరిగిన వాదనలో కానిస్టేబుల్ వద్ద ఉన్న లాఠీని తీసుకుని అతన్నే కొట్టడం మెుదలు పెట్టాడు దినేష్. కానిస్టేబుల్ చాలా సౌమ్యంగా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా వెంబడించి కొట్టాడు. పోలీస్ తలపై కూడా లాఠీతో తీవ్రంగా కొట్టాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులెవరు కనీసం ఆ దాడిని వారించే సాహసం కూడా చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇక కానిస్టేబుల్ని కొట్టిన ప్రాంతంలోనే.. నిందితుడికి బుద్దిచెప్పి క్షమాపణలు చెప్పించారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. మెుదట పోలీసును కొట్టడం ఆ తర్వాత పోలీసులు అంతా దినేశ్కి బుద్దిచెబుతూ వీధిలో తిప్పుతున్న వీడియో రెండిటినీ కలిపి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పోలీసులతో పెట్టుకుంటే ఇలానే అవుతుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
