Site icon 123Nellore

అఖిల్‌ మూవీతో జాన్వీ కపూర్‌ ఎంట్రీ?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతుందా అని ఇక్కడి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపునే సాధించుకుంది. అయితే తెలుగులో మాత్రం ఇంకా ఈ అమ్మడు అడుగుపెట్టలేదు. దీంతో ఈమెను టాలీవుడ్‌లో ఓ భారీ చిత్రంతో లాంఛ్ చేయాలని ఆమె తండ్రీ బోనీ కపూర్‌తో పాటు తెలుగు దర్శకనిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే అఖిల్‌తో జాన్వీ ఎంట్రీ ఇవ్వనుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమాతో హిట్టు కొట్టిన అఖిల్‌ అ‍క్కినేని ప్రస్తుతం ఏజెంట్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌ లుక్‌పై ఇప్పటికే ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్న అఖిల్‌ ఇందులో 6ప్యాక్‌ బాడీతో కనిపించనున్నాడు. ఇక ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం అనంతరం అఖిల్‌ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌జోహార్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్‌కి జంటగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని చూస్తున్నారు.

పాన్ ఇండియా ఆడియెన్స్‌ను మెప్పించే కథను కరణ్ జోహర్ సిద్ధం చేశాడట. కాగా ఈ సినిమాను తీర్చిదిద్దే ఓ సరైన డైరెక్టర్ కోసం ఆయన వెతుకుతున్నాడట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే అఖిల్ చేయబోయే ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఖాయమే అంటున్నారు బాలీవుడ్ సినీ ఎక్స్‌పర్ట్స్. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Exit mobile version