Site icon 123Nellore

నా తమ్ముడి ప్రాణాలకు వాళ్లతో ముప్పు: మాజీ మంత్రి భూమూ అఖిలప్రియ

తన తమ్ముడి ప్రాణాలకు పోలీసులతో ముప్పు ఉందని మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ ఇంఛార్జ్ భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆళ్లగడ్డ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. తన తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రాణాలకు పోలీసుల నుంచి ముప్పు ఉనట్లు ఆమె బుధవారం ఆరోపించారు. ప్రజల కోసం తమ తండ్రి భూమా నాగిరెడ్డి సొంత నిధులతో బస్ స్టాప్ కట్టించారని తెలిపారు. ఆ బస్టాప్ కూల్చివేతను తన తమ్ముడు అడ్డుకుంటే, అతనిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.

ఎటువంటి వర్క్ ఆర్డర్ లేకుండానే ప్రజల ఆస్తి అయిన బస్ స్టాప్ ను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతను ప్రశ్నించిన తన తమ్ముడిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. భూమా జగత్ రెడ్డి తప్పు చేస్తే తానే పోలీసుల వద్దకు తీసుకెళ్తానని తేల్చి చెప్పారు. ఆళ్లగడ్డలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై గురువారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కూల్చివేతల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, బాధితులకు అండగా తాము నిలబడతామని హామీ ఇచ్చారు.

ఆళ్లగడ్డలో అభివృద్ధి ముసుగులో అక్రమాలు జరుగుతున్నాయని అఖిలప్రియ ఆరోపించారు. ఈ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని… నిరూపించలేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని వైసీపీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న అఖిలప్రియ కుటుంబం ఒక్కసారిగా బయటకు రావడంతో ఆళ్లగడ్డలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఏం జరుగుతుందోనన్న ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Exit mobile version