మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతుందని మెగా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఇప్పుడీ చిత్రంలో సూపర్స్టాక్ మహేష్బాబు భాగమయ్యారు.
అయితే ఈ సినిమాలో ఆయన కనిపించరు. వినిపిస్తారు. తన గళంతో కథను నడిపిస్తారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ధృవీకరించింది. ఈ సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ అందించారని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన రికార్డింగ్ పనులు పూర్తయ్యాయని తెలిసింది. అయితే పవర్ఫుల్ కథాంశంతో సిద్ధమైన ఈ సినిమాలో మహేశ్ కూడా ఉన్నారంటూ ఇటీవల వరుస కథనాలు చక్కర్లు కొట్టాయి. ఈనేపథ్యంలో పలువురు అభిమానులు, నెటిజన్లు.. ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఇవ్వాలంటూ చరణ్, చిరు, నిర్మాణ సంస్థలకు వరుస పోస్టులు పెట్టారు. కాగా, అభిమానుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులపై తాజాగా చిరు స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు థాంక్స్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. రామ్ చరణ్ కూడా మహేష్కు థాంక్స్ చెప్పారు.
“నేను, చరణ్ నీ వాయిస్ విని ఎంత ఆనందించామో… అభిమానులు, ప్రేక్షకులు కూడా నీ వాయిస్ విని అంతే థ్రిల్ అవుతారని నమ్ముతున్నా. ‘ఆచార్య’ సినిమాలో ఓ పార్ట్ అయినందుకు థాంక్యూ” అని చిరంజీవి ట్వీట్ చేశారు. “థాంక్యూ మహేష్. ‘ఆచార్య’ సినిమాను మీరు మరింత ప్రత్యేకంగా మార్చారు. వెండితెరపై ప్రేక్షకులు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారా? అని ఎదురు చూస్తున్నాను” అని రామ్ చరణ్ పేర్కొన్నారు.” ఇక దేవాలయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం ‘ధర్మస్థలి’ పేరుతో ఓ భారీ సెట్ని క్రియేట్ చేశారు. పూజా హెగ్డే, కాజల్ కథానాయికలు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్స్ బ్యానర్స్పై నిరంజన్రెడ్డి, రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఏప్రిల్ 29న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
