Site icon 123Nellore

బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్‌ కేసు.. ఏమైందంటే..!

ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో ఈ ఇద్దరిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు నమోదైంది.

బెల్లంకొండ సురేష్.. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి వద్ద కొత్త సినిమా కోసం 2018-19 మధ్యలో 50 లక్షలు తీసుకున్నాడని, తరువాత గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నామని మరికొంత డబ్బు తీసుకున్నారని ఫిర్యాదులో నమోదైంది. చాలా మంది టెక్నీషియన్లకి తన అకౌంట్‌ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేశారని శ్రవణ్‌ వెల్లడించారు. తనని సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తానని చెప్పి డబ్బు తీసుకున్నారని చెప్పారు. ఆ తరువాత సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో తన డబ్బులు రిటర్న్ అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని, దీంతో భయపడి కోర్టును ఆశ్రయించినట్లు శ్రవణ్ చెప్పుకొచ్చాడు. కోర్టు ఆదేశాలతో శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

అయితే ఈ కేసుపై నిర్మాత బెల్లంకొండ సురేష్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల `అదుర్స్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ లో ‘ఛత్రపతి’ రీమేక్ లో నటిస్తున్నారు. అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. పాన్‌ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించబోతున్నారు. ఓ స్టార్‌ డైరెక్టర్‌ ఈచిత్రానికి వర్క్ చేయబోతున్నారని సమాచారం.

Exit mobile version