టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘ఆచార్య’ ఒకటి. చిరంజీవి, రామ్చరణ్ మల్టీస్టారర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మొదటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లలో పాల్గొంటూ ప్రతి రోజు ఏదో ఒక అప్డేట్ను ఇస్తూ ప్రేక్షకుల అటెన్షన్ను తిప్పుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘స్పిరిట్ ఆఫ్ ధర్మస్థలి’ అంటూ ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
‘ధర్మస్థలి’ని ఎలా సృష్టించారో , అసలు ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అనేది డైరెక్టర్ కొరటాల శివ వివరించారు. ‘‘పురాతన గాథలు, ఎన్నో నమ్మకాలు కలిగిన అమ్మవారి దేవాలయం ఉన్న ప్రాంతమది. దాని పేరు ‘ధర్మస్థలి’. కథ ఎక్కువగా ధర్మం అనే కాన్సెప్ట్ చుట్టే ఉంటుంది కాబట్టి.. ఆ టెంపుల్ టౌన్కి ‘ధర్మస్థలి’ అనే పేరు పెడితే బాగుంటుందని భావించాం. మా అందరికీ ఆ పేరు బాగా నచ్చింది. ‘సినిమా అనుకున్నపుడే.. ఓ మంచి టెంపుల్ టౌన్ కావాలనుకున్నాం. చాలా ప్రాంతాల్లో వేర్వేరు అంశాలు నచ్చాయి. షూటింగ్ సాధ్యం కాదేమో అనిపించి.. చివరకు మేమే ‘ధర్మస్థలి’ సృష్టించాలనుకున్నాం. నిర్మాతలు కూడా ఓకే అనటంతో మా ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ ఎన్నో ప్రాంతాలకు వెళ్లి.. పరిశోధన చేసి దేవాలయాల పవిత్రత ఎక్కడ దెబ్బతినకుండా తీర్చిదిద్దారు. సెట్ నిర్మించేప్పుడు పూజలు కూడా చేశాం. సినిమా చూసినప్పుడు ‘ధర్మస్థలి’ ఎక్కడుంది? అక్కడికి వెళ్దామనే ఆలోచన ప్రతి ఒక్కరికీ వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అదొక అందమైన ప్రదేశం. 20 ఎకరాల్లో కోట్లు వెచ్చించి నిర్మించిన బిగ్గెస్ట్ సెట్ ఇది’’ అని కొరటాల తెలిపారు.
ఆచార్య చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ ధర్మస్థలి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డేలు కథానాయికలుగా నటించారు. మ్యాట్నీ ఎంటర్టైనమెంట్స్తో కలిసి రామ్చరణ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
