Site icon 123Nellore

రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23), అతడి స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది.

మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వీరిద్దరూ మద్యం సేవించి ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. ప్రమాద సమయంలో వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును అక్కడి నుంచి తీసివేశారు. ప్రమాదం ఉదయం 3 గంటలకు జరిగింది. మృతి చెందింది మంత్రి కుమారుడనే విషయాన్ని పోలీసులు వచ్చే వరకు తెలియలేదు.

నారాయణ కుమారుడు నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ కుమారుడి మరణ వార్త వినగానే హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు. నిశిత్ మరణ వార్తను విన్న మంత్రి నారాయణ భార్య,  కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆస్పత్రికి చేరుకున్నారు

Exit mobile version