Site icon 123Nellore

ప్రధానమంత్రి మోడీ భావోద్వేగ ప్రసంగం

నోట్లరద్దు కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తనకు తెలుసునని, అయితే.. తనకు 50 రోజులపాటు, డిసెంబర్ 30 వరకూ సహక రించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత తాను చేసినదాంట్లో తప్పుందని భావిస్తే బహిరంగంగా తనను ఉరి తీయవచ్చంటూ భావోద్వేగపూరితంగా పేర్కొన్నారు. నోట్లరద్దు నిర్ణయం వెనుక పదినెలలపాటు అత్యంత రహస్యంగా కార్యాచరణను కొనసాగించా మని మోదీ వెల్లడించారు. భారతదేశాన్ని నల్లధనం నుంచి, అవినీతి నుంచి విముక్తి చేయటానికి తాను, తన ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో.. పెద్దనోట్ల రద్దు అన్నది ఆరంభం మాత్రమేనన్నారు.

పనాజీ/ బెళగావి లలో నవంబర్ 13 న జరిగిన సభల్లో ప్రధాని ప్రసంగించారు. నోట్లరద్దు వల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందిస్తూ.. 50 రోజులపాటు (డిసెంబర్ 30 వరకూ) తనకు సహకరించాలని, దేశాన్ని అవినీతి రహితంగా మారుస్తానని తెలియజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాకు తెలుసు. కానీ, అవి కేవలం 50 రోజుల వరకే. దేశాన్ని నల్లధనం నుంచి ప్రక్షాళన చేయాలన్న లక్ష్యసాధనలో మనం 50 రోజుల తర్వాత విజయం సాధిస్తాం. ఆ తర్వాత ఒక్క దోమ కూడా మిగలదు. నా (నోట్లరద్దు) నిర్ణయాన్ని దయచేసి అహంకారంగా భావించవద్దు. డిసెంబర్ 30 వరకూ నాకు సహకరించండి. నా ఆలోచనల్లో, నా కార్యాచరణలో మీకు ఏమైనా తప్పులు దొరికితే నన్ను బహిరంగంగా ఉరితీయండి.

మీరు కోరుకున్న భారతదేశాన్ని అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానంటూ ఉద్వేగపూరితంగా మోదీ పేర్కొన్నారు. భారతదేశాన్ని అవినీతి రహితంగా మలచటానికి తన వద్ద మరిన్ని ఆలోచనలున్నాయని… పెద్దనోట్ల రద్దన్నది ఆరంభం మాత్రమేగానీ అంతంకాదని ప్రధాని స్పష్టం చేశారు. బినామీ ఆస్తుల మీద కచ్చితంగా చర్యలను తీసుకుంటామన్నారు. జపాన్ పర్యటనను ముగించుకువచ్చిన ప్రధాని మోదీ… గోవాలోని పనాజీ, కర్ణాటకలోని బెళగావిలలో ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. రూ.500, 1,000 నోట్ల రద్దుపై అటు ప్రజల్నించి ఇటు రాజకీయపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో… మోదీ ఈ అంశానికి సంబంధించిన పలుకోణాలను స్పృశిస్తూ మాట్లాడారు. ఏడు దశాబ్దాలుగా దోచుకున్న సొమ్ము… నోట్లరద్దుతో వృథాగా మారిన నేపథ్యంలో కొన్ని శక్తులు తనపై కత్తులు నూరుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి పరిణామాల్నైనా ఎదుర్కోవటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. దేశంలో నగదురహిత లావాదేవీలు మొదలుకావాలని, ప్లాస్టిక్‌మనీ విస్తృతవినియోగంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే…

నాకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పని చేస్తున్న విషయం నాకు తెలుసు. వాళ్ల 70 ఏండ్ల దోపిడీ సంప ద ఇప్పుడు చిక్కుల్లో పడింది. కాబట్టే వాళ్లు నన్ను నాశనం చేయాలనుకుంటున్నారు. వారి నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉ న్నాను. నా జట్టును పట్టుకుంటే నేను ఆగిపోతానని వాళ్లు భావించారు. కానీ, నేను అలా లొంగిపోయే వ్యక్తిని కాను. నన్ను సజీవంగా తగులబెట్టినా కూడా నల్లధనంపై నా పోరాటాన్ని నిలిపివేయను. నిజాయితీపరులను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం భావించటం లేదు. అదేసమయంలో అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటివరకూ దేశం దోపిడీకి గురైందా? లేదా? ఈ అంశాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ జరిగిన గత 70 ఏండ్ల అవినీతి చరిత్రను బట్టబయలు చేసి తీరుతాను. నోట్లరద్దుతో ఇది ముగియదు. దేశాన్ని అవినీతిరహితంగా మలచటానికి నా వద్ద మరిన్ని ఆలోచనలు (ప్రాజెక్టులు) ఉన్నాయి. బినామీ ఆస్తుల మీద చర్యలు తీసుకుంటాం. అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించటానికి ఇది ప్రధానచర్య. దేశంలో దోపిడీ చేసి విదేశాలకు తరలించిన సొమ్మును తిరిగి తీసుకురావటం మన బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు.

అవినీతిపై కాంగ్రెస్ పోరాడలేదు

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతిపై ఎలాంటి పోరాటం చేయటం లేదంటూ మోదీ మండిపడ్డారు. బొగ్గు, 2జీ తదితర కుంభకోణాలతో ప్రమేయమున్న వాళ్లు రూ.4,000 కోసం నేడు క్యూలో నించుంటున్నారంటూ ఢిల్లీలో రాహుల్ నోట్లమార్పిడి కోసం ఒక క్యూలో నిల్చోవటాన్ని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 25 పైసల నాణేన్ని చెలామణీలోంచి నిలిపివేసినప్పుడు మనం ఏమైనా అన్నామా? మీరు 25 పైసల నాణేన్ని మాత్రమే నిలిపివేయగలిగారు. మీ ధైర్యం అంతటికే పరిమితం. పెద్దనోట్లను మీరు రద్దు చేయలేకపోయారు. మేం ఆ పని చేశాం. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దేశప్రజానీకం నన్ను ఏం చేయమని చెప్పిందో నేడు ఆ పనే చేస్తున్నా.

నా మంత్రివర్గ తొలి సమావేశంలోనే.. నల్లధనం వెలికితీత కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటుచేశాను. మేం అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లోనే… విదేశాలకు తరలిపోయిన నల్లధనంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. నల్లధనంపై పోరాటానికి సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు వివరాల్ని అందిస్తూనే ఉన్నాం. ఈ విషయంలో వివరాల్ని నేనేమైనా దాచిపెట్టానా? స్వచ్ఛంద వెల్లడి పథకం కింద ఇప్పటివరకూ రూ.67వేల కోట్ల మొత్తాన్ని సేకరిం చాం. ఐటీశాఖ దాడులు, సర్వేలు, డిక్లరేషన్లు తదితర మార్గాల్లో గడిచిన రెండేండ్లలో ప్రభుత్వం రూ. 1,25,000 కోట్ల మొత్తాన్ని ఖజానాకు జమచేసింది. నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చటానికి చిన్నమోతాదుల్లో ఔషధాన్ని ఇస్తున్నా. దీంట్లోభాగంగానే జన్‌ధన్‌యోజనను కూడా తీసుకొచ్చాంఅని మోదీ తెలియజేశారు.

అత్యంత రహస్య ఆపరేషన్

పెద్దనోట్ల రద్దు అంశంపై గడిచిన పది నెలలుగా అత్యం త రహస్యంగా సమీక్ష జరుపుతున్నామని మోదీ వెల్లడించారు. అదొక రహస్య ఆపరేషన్. పది నెలల కింద నేను ప్రారంభించాను. ఒక చిన్న బృందాన్ని ఏర్పాటుచేశాను. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పారికర్ (రక్షణమంత్రి) నిర్వహించిన లక్ష్యిత మెరుపుదాడుల్లాంటిది కాదిది. కొత్త కరెన్సీనోట్ల ముద్రణతోపాటు ఇతర చర్యలెన్నింటినో రహస్యంగా అమలుచేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు బయటకు పొక్కితే అవినీతిపరులు ముందుజాగ్రత్తపడి జారుకునే ప్రమాదం ఉంది అని మోదీ చెప్పారు. నగదురహిత లావాదేవీలు జరిగే సమాజంవైపు, ప్లాస్టిక్‌మనీ వైపు మనం క్రమంగా మళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీనికోసమే డెబిట్, క్రెడిట్‌కార్డులకు సంబంధించిన అన్ని పన్నులను బడ్జెట్‌లో తొలగించామని గుర్తుచేశారు.

భయాందోళన వద్దు

నోట్లరద్దు కారణంగా భయాందోళనలకు గురికావద్దంటూ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము పూర్తి విలువను పొందండి. రూ.500 నోటును రూ.300కు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నోట్లరద్దు వల్ల కలుగుతున్న ఇబ్బందులకన్నా దేశానికి కలిగే లాభం ఎక్కువగా ఉంటుంది. మరో 50 రోజులపాటు (డిసెంబర్ 30 వరకూ) నాకు సహకరించండి. నా ఆలోచనల్లో, నా కార్యాచరణలో మీకు ఏమైనా తప్పులు దొరికితే నన్ను బహిరంగంగా ఉరి తీయండి. మీరు కోరుకున్న భారతదేశాన్ని అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఎవరైనా ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఆ బాధ నాకు కలుగుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాకు తెలుసు. కానీ, ఇది కేవలం 50 రోజుల వరకే. దేశాన్ని నల్లధనం నుంచి ప్రక్షాళన చేయాలన్న లక్ష్యసాధనలో మనం 50 రోజుల తర్వాత విజయం సాధిస్తాం. ఆ తర్వాత ఒక్క దోమ కూడా మిగలదు.

నా (నోట్లరద్దు) నిర్ణయాన్ని దయచేసి అహంకారంగా భావించవద్దు. అత్యున్నతమైన (ప్రధాని) పదవిని అధిష్ఠించటం కోసమే నేను పుట్టలేదు. దేశం కోసం నేను నా గ్రామాన్ని, నా కుటుంబాన్ని వదిలేశాను. నల్లధనం, అవినీతిపై చేపట్టిన పోరాటంలో నాకు పేదలతోపాటు అనేకమంది తల్లుల ఆశీస్సులున్నాయి. ఈ పోరాటంలో ఈ ఆశీస్సులే చోదకశక్తిగా పని చేస్తున్నాయి. పెద్దనోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న నేను నిర్ణయాన్ని ప్రకటించిన రోజున… కోట్లాదిమంది జనం ప్రశాంతంగానే పడుకున్నారు. కానీ అవినీతిపరులైన కొన్ని లక్షలమంది మాత్రం నిద్రను కోల్పోయి నిద్రమాత్రలను వెతుక్కున్నారు. మీకు (ప్రజలకు) దిగ్భ్రాంతిని కలిగించే మరో విషయం ఏమిటంటే… రూ.రెండు లక్షలకన్నా ఎక్కువ విలువైన ఆభరణాల కొనుగోళ్లలో వినియోగదారుల పాన్ నంబర్‌ను వ్యాపారులు తప్పనిసరిగా తీసుకోవాలంటూ ప్రభుత్వం చట్టం చేసినప్పుడు… సగానికిపైగా ఎంపీలు… ఆ నిబంధనల్లో సడలింపునివ్వాలంటూ నన్ను సంప్రదించారు. కొందరు నాకు లేఖలు రాసే ధైర్యం కూడా చేశారు. ఆ ఉత్తరాలను బహిరంగపరిస్తే వాళ్లు వారి నియోజకవర్గాలకు వెళ్లే పరిస్థితి ఉండదు. తమ ముసలితల్లిని ఏనాడూ పట్టించుకోని వాళ్లు ఈ రోజు ఆమె ఖాతాలో రూ.2.5 లక్షలు జమ చేస్తున్నారు అని మోదీ ఎద్దేవా చేశారు.

వ్యాపారులకు భరోసా కల్పించాం

ఆభరణాలపై ఎక్సైజ్ పన్నును విధించాలని నిర్ణయించినప్పుడు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని మోదీ తెలిపారు. ఐటీ అధికారుల నుంచి వేధింపులు ఎక్కువవుతాయంటూ ఆభరణాల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారని.. కానీ, వారికి పూర్తి భరోసా కల్పించామని, అధ్యయనం కోసం ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటుచేశామని చెప్పారు. దేశంలో ఉప్పు కొరత ఉందన్న పుకార్లను నమ్మవద్దని, ఇవన్నీ నల్లధనం నిరుపయోగంగా మారినవాళ్లు సృష్టిస్తున్న వదంతులని మోదీ పేర్కొన్నారు. నల్లధనాన్ని పోగు చేసి పెట్టుకున్నవాళ్లు ఇప్పటికైనా నిర్దేశిత జరిమానా చెల్లించి ఆ సొమ్మును చట్టబద్ధం చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఇంకా వేచి చూద్దామని ఎవరైనా భావిస్తే… అది వాళ్లిష్టం. నా గురించి వారికి ఇంకా తెలియదు అని ప్రధాని హెచ్చరించారు.

-నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చటానికి చిన్నమోతాదుల్లో ఔషధాన్ని ఇస్తున్నా.
దేశం కోసం నేను నా గ్రామాన్ని, నా కుటుంబాన్ని వదిలేశాను. నల్లధనం, అవినీతిపై చేపట్టిన పోరాటంలో నాకు పేదలు, అనేకమంది తల్లుల ఆశీస్సులున్నాయి. ఈ పోరాటంలో ఈ ఆశీస్సులే చోదకశక్తిగా పని చేస్తున్నాయి.

-నల్లధనాన్ని పోగు చేసి పెట్టుకున్నవాళ్లు ఇప్పటికైనా నిర్దేశిత జరిమానా చెల్లించి ఆ సొమ్మును చట్టబద్ధం చేసుకోవాలి. ఇంకా వేచి చూద్దామని భావిస్తే… అది వాళ్లిష్టం. నా గురించి వారికి ఇంకా తెలియదు

-పెద్దనోట్ల రద్దు అంశంపై పది నెలలుగా అత్యంత రహస్యంగా సమీక్ష జరిపాం. ఒక చిన్న బృందాన్ని ఏర్పాటుచేశాం. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహించిన లక్ష్యిత మెరుపుదాడుల్లాంటిది కాదిది. వివరాలు బయటకు పొక్కితే అవినీతిపరులు ముందుజాగ్రత్తపడి జారుకునే ప్రమాదం ఉంది.

-బొగ్గు, 2జీ తదితర కుంభకోణాలతో ప్రమేయమున్న వాళ్లు రూ.4,000 కోసం నేడు క్యూలో నించుంటున్నారు (రాహుల్‌గాంధీని ఉద్దేశించి). కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతిపై ఎటువంటి పోరాటం చేయలేదు.

Exit mobile version